Mahaa Daily Exclusive

  ఏఐ పంజా: రూ.70 వేల కోట్ల ‘బిర్యానీ కుంభకోణం’ గుట్టురట్టు..

Share

  • రూ.70 వేల కోట్ల ‘హైదరాబాద్ బిర్యానీ కుంభకోణం’
  • ఏఐ టూల్స్‌తో పట్టేసిన ఐటీ అధికారులు
  • 2019 నుంచి జరుగుతున్న తంతు

హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మొదలైన చిన్న తనిఖీ దేశవ్యాప్తంగా ఏకంగా రూ.70 వేల కోట్ల బిర్యానీ కుంభకోణాన్ని బయటపెట్టింది. బిల్లులను తక్కువగా చేసి చూపించి ప్రభుత్వానికి కట్టే పన్నులను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అయితే ఏఐ టూల్స్ ఉపయోగించి.. ఈ భారీ స్కామ్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఏకంగా 1.77 లక్షల రెస్టారెంట్ల నుంచి 60 టీబీల బిల్లింగ్ డేటాను విశ్లేషించిన అధికారులు ఈ కుంభకోణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌‌లో అవకతవకలను గుర్తించి.. తనిఖీలు చేయగా ఈ అసలు మోసం వెలుగులోకి వచ్చింది. బిల్లులను పూర్తిగా డిలీట్ చేయడం, తగ్గించడం వంటి పద్ధతులతో 2019 నుంచి ఈ మోసం జరిగినట్లు తాజా విచారణలో వెల్లడైంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పన్ను ఎగవేత అధికంగా ఉన్నట్లు తేల్చారు. దాదాపు 27 శాతం అమ్మకాలను లెక్కల నుంచి తొలగించారని అధికారులు నిర్ధారించారు. అయితే ఇది ఇప్పటివరకు దొరికిందేనని విచారణ జరిపితే మరింత ఎక్కువ స్కామ్ బయటపడుతుందని తెలిపారు.

హైదరాబాద్‌లోని ఓ బిర్యానీ హోటల్‌లో మొదలైన చిన్న తనిఖీ, దేశవ్యాప్తంగా దాదాపు 70 వేల కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా, ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇలా దాదాపు 70వేల కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది. హోటళ్లలో కస్టమర్లు తిన్న ఫుడ్‌కు సిస్టమ్ జనరేటెడ్ బిల్ తయారు చేసేందుకు ఉపయోగించే ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా ఐటీ అధికారులు ఈ మోసాన్ని మొదట వెలుగులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో దొరికిన తీగను లాగితే దేశవ్యాప్తంగా డొంక కదలింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షలాది హోటళ్లు ఒకే రకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 1.77 లక్షల హోటళ్ల రికార్డులు 60 టెరాబైట్ల సమాచారాన్ని ఏఐ, జనరేటివ్ ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్ టూల్స్‌ను ఉపయోగించి ఈ కుంభకోణాన్ని బయటికి తీశారు. రెస్టారెంట్లలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు నగదు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా వచ్చే ప్రతి పైసాను సాఫ్ట్‌వేర్‌లో స్టోర్ చేస్తారు. అయితే ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్సులను తప్పించుకునేందుకు కొన్ని రెస్టారెంట్లు రకరకాల పద్ధతులను పాటించినట్లు గుర్తించారు. ప్రధానంగా బిల్లులను ఎంపిక చేసి డిలీట్ చేయడం, కొన్ని రోజుల పాటు బిల్లింగ్ డేటాను సాఫ్ట్‌వేర్ నుంచి పూర్తిగా తొలగించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఉదాహరణకు ఒకచోట రూ.2,784 బిల్లును కేవలం రూ.27కి తగ్గించినట్లు గుర్తించారు.

ఏఐ డేటా విశ్లేషణలో దేశవ్యాప్తంగా రూ.13,317 కోట్ల విలువైన బిల్లులను డిలీట్ చేసినట్లు తేలింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.5,141 కోట్ల అమ్మకాలను మాయం చేసినట్లు తెలిపారు. 40 రెస్టారెంట్లలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ. 400 కోట్ల పన్ను ఎగవేసినట్లు బయటపడింది. ట్యాక్స్ ఎగవేత అధికంగా ఉన్న తొలి 5 రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. కర్ణాటక రూ.2 వేల కోట్ల బిల్లుల తొలగింపుతో మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రూ.1,500 కోట్లు.. తమిళనాడు రూ.1,200 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో సగటున 27 శాతం ఆదాయాన్ని రెస్టారెంట్లు తక్కువగా చూపించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Latest