- బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
- పూరన్ కుమార్ కుటుంబంతో మాట్లాడిన సీఎం రేవంత్
- ఐఏఎస్ అమనీత్ను, కుటుంబ సభ్యులను ఓదార్చిన భట్టి విక్రమార్క
చండీఘడ్, మహా: చండీఘడ్లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం పరామర్శించారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని.. పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని ఈ సందర్భండి భట్టి విక్రమార్క తెలిపారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పూరన్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడని.. ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడని.. ఐఐఎం అహ్మదాబాదులో చదివిన గొప్ప మేధావి అని కొనియాడారు డిప్యూటీ సీఎం. ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. చాలా తీవ్రమైన అంశమన్నారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ డైయింగ్ డిక్లరేషన్గా భావించాలని కోరారు.







