Mahaa Daily Exclusive

  అన్నదాతలకు బాసటగా మంత్రి “తుమ్మల” – ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల పరవళ్ళు – సాగునీరు లేక ఎండుతున్న పంటలు మంత్రి తుమ్మలకు జేజేలు పలుకుతున్న రైతులు..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12 (మహా):
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు బాసటగా నిలుస్తున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు అందక నారుమళ్ళు, పొలాలు ఎండిపోతున్న తరుణంలో పంటలకు గోదావరి నీరు విడుదల చేయించి రైతన్నలకు కొండంత భరోసాగా నిలిచారు.

రైతుల మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ….

జిల్లాలో వర్షాలు సకాలం లో పడక సాగు నీరు లేక పంటలు ఎండి పోతున్నాయని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విజ్ఞప్తితో రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల రైతాంగాన్ని ఆదుకునేందుకు గోదావరి జలాలు విడుదల చేయాలని నిర్ణయించారు. నిర్ణయమే తరువాయిగా సీతారామ ప్రాజెక్టు నుంచి నీటినీ ఉమ్మడి ఖమ్మంలోని జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టుకు విడుదలపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తముమార్ రెడ్డి, కలెక్టర్లతో తుమ్మల మాట్లాడారు. ప్రస్తుతం వర్షాలు లేక, సాగర్ నీరు రాక వరి నారుమళ్లు, పొలాలు ఎండిపోతున్నాయని నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యమవుతోందని, సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదలకు నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కు మంత్రి తుమ్మల సూచించారు. వెనువెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లతోనూ మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతాంగ అవసరాలు దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు తక్షణమే నీటి విడుదలకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

పంటలకు ఊపిరి పోసిన మంత్రి తుమ్మల…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, సత్తుపల్లి వర్షాధారం మీద ఆధారపడిన అశ్వరావుపేట, కొత్తగూడెం ,పినపాక నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందించి రైతులకు మంత్రి తుమ్మల ఊపిరి పోశారు. లక్షలాది ఎకరాలలో పంటలు సాగు చేసి, నారుమళ్లు పోసి వర్షాలు, సాగర జలాల కోసం చూస్తున్న రైతులకు సాగర్ నీరు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపద్యంలో రైతులు ఆందోళన చెందారు. మంత్రి తుమ్మలకు సమస్యను వివరించారు. నీరు లేకుంటే పంటలు నిలువునా ఎండిపోతాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి తుమ్మల ఆయకట్టు పరిధిలో రైతులకు నీరు అందించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చెప్పిన వెంటనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నీరు విడుదల చేయించి రైతన్నల ఆప్తమిత్రుడిగా చెరగని ముద్ర వేశారు.
మంత్రి తుమ్మల అనూహ్య నిర్ణయంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి చేసిన కృషికి మంత్రి తుమ్మలకు రైతన్నలు జేజేలు పలుకుతున్నారు.

వచ్చే సీజన్ నాటికి…..
వచ్చే సీజన్ నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని వైరా , సత్తుపల్లి నియోజకవర్గాలలో సుమారు 1 లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు భూ సేకరణ (లాండ్ ఎక్విజిషన్) కు నిధులు సమకూరుస్తామని పనులు మొదలు పెట్టుకోవాలని, సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారని, దీంతో ఈ ప్రక్రియ అమలు చేయడం కోసం ఉభయ జిల్లా కలెక్టర్లతో పాటు, ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేసామని తుమ్మల తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలు కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు లలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల ఎకరాల నుండి 50 వేల ఎకరాల వరకు సాగునీటి లభ్యత ఉంటుందని, దీంతో వచ్చే సీజన్ నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు.
జిల్లా సస్యశ్యామలమే తుమ్మల లక్ష్యం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల కీలక అడుగులు వేస్తున్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ , సీతమ్మ సాగర్ లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు విశేష కృషి చేశారు. సీతారామ ప్రాజెక్టు ఆది నుంచి పూర్తి చేసేలా అహర్నిశలు శ్రమించారు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారనే మాట వినగానే ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం కదిలించి రైతులకు నిరంధించేలా చొరవ చూపారు.

ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సీతారామ ప్రాజెక్టు ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ పి డీసీఎల్ ఎస్సీ మహేందర్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Latest