ఆదిలాబాద్, మహా
ఆపత్కాల సమయాల్లో ముందుగా చేరుకొని విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రథమ చికిత్సలపై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇందుకు గానూ బ్లూ కోర్ట్, డయల్ హండ్రెడ్ సిబ్బందికి రెండు విడతలగా ప్రథమ చికిత్స గురించి శిక్షణను అందించనుండగా… గురువారం స్థానిక పోలిస్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణను ఎస్పీ ప్రారంభించారు. ఐదుగురు నిష్ణాతులైన వైద్యులతో ప్రథమ చికిత్సకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీసులు ముందుండి ఘటన స్థలాలకు చేరుకుంటారని, అక్కడ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఆపే శక్తి సిబ్బందికి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రథమ చికిత్సలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సి.పీ.ఆర్ ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం వరకు చేయాలి అనే అంశాలపై డాక్టర్లతో డెమో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ షాక్, పాము కాటు బాధితులకు, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి అందించే ప్రథమ చికిత్సలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ అవకాశాన్ని పొలిసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ఏఆర్ డిఎస్పి ఇంద్ర వర్ధన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.








