ఆదిలాబాద్, మహా
రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకనే తనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్గంగా గెస్ట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రోఫైనాన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నిందితుడు పరారైన ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. నిందితుడు తనకు స్నేహితుడేనని, కలిసి చదువుకున్నామన్నారు. అయితే నిందితుడి పౌండేషన్కు తన పౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యేగా నా వద్దకు మంచివారు, చెడ్డవారు వస్తారని నిందితుడు సైతం అలాగే వచ్చారన్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసాకా దూరం పెట్టానని , కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా వెళ్లలేదన్నారు. నేను ఎమ్మెల్యేగా కావడం జీర్ణించుకోలేక పోతున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు సోషల్ మీడియాలో, పత్రికల్లో , యూటుబ్ చానళ్లలో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాద్యులైన వారికి లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మోసపోయిన గిరిజన యువతకు న్యాయం చేసేలా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.








