ఆదిలాబాద్ మహా : ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు త్యాగ ధనుల పుణ్యఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. విద్యార్దులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ప్రజలతో కలిసి తిలకించారు. జిల్లా ప్రజలందరికి 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.1945లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ తో కలిసి క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఎందరో త్యాగధనుల ఫలితంగా దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేసారు. అహింసా మార్గాన మహాత్మ గాంధీ స్వాతంత్య్రం తెచ్చారని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి చక్కటి జనరంజక పాలన అందిస్తుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ప్రింటింగ్ పూర్తికావచ్చాయన్నారు.ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయ చిత్ర ప్రదర్శన స్టాల్స్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడం నగేష్ ఎమ్మెల్యేలు శంకర్ ,వెడ్మ బొజ్జు , అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ కాజల్ సింగ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.








