ఆదిలాబాద్ మహా: ఆదిలాబాద్లో భారీ భూ కుంభకోణాన్ని మావల పోలీసులు బట్టబయలు చేసారు.
భూకబ్జాలపై మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగు చూసినట్టు తెలిపారు.పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. బాధితుడు మిల్లింద్ కొర్తల్వార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ.నానం వెంకటరమణ, బీజీపీ నేత ఉష్క మల్ల రఘుపతి , రిమ్స్ ఆయుష్ విభాగం ప్రభుత్వ ఉద్యోగి బెజ్జవార్ సంజీవ్కుమార్ లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు .ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించి సుమారు 2కోట్ల విలువైన ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ అశోక్కు 7 లక్షల రూపాయల లంచం ఇచ్చి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అతని పై కూడా కేసు నమోదు చేసామని ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వివరించారు. నిందుతులపై ఐపీసీ 447, 427, 420, 467, 468, 471, 120-బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






