హైదరాబాద్, మహా: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వీస్ రోడ్డును మింగి ఆదిత్య వింటేజ్ భారీ భవనం నిర్మిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని.. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కాపీ పంపుతానని ఎంపీ చెప్పారు. పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని… పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు.
సూట్ కేసులు అందుకుంటున్న మంత్రులెవరు?
నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రఘునందన్ రావు హెచ్చరించారు. హెచ్ఎమ్డీఏ అధికారులే కేసులు వేస్తారని.. మళ్లీ వారే అనుమతి ఇస్తారని విమర్శించారు. ఈ నిర్మాణ అనుమతులలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, హద్దులు తొలగించారని క్రిమినల్ కేసులు నమోదు చేశారని.. ఈ నిర్మాణంలో సూట్ కేసులు అందుకుంటున్న మంత్రులు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నీతి వాఖ్యలు చెబుతుంటారు.. అందుకే ఆయనకు చెబుతున్నాను.. మంత్రుల మీద చర్యలు తీసుకోమని ఏఐసీసీకి లేఖ రాయండి’ అంటూ హితవుపలికారు. వంద శాతం అవినీతి జరిగిందని.. అక్రమ నిర్మాణం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు






