- కాంట్రాక్టుల్లో వాటానా?..
- కమీషన్లు వస్తున్నాయా.. రేవంత్ రెడ్డి?
- ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా ఎందుకు స్పందించట్లేదు
- బనకచర్లపై కేంద్రం లేఖ రాసి 20 రోజులవుతున్నా స్పందించవా?
- ఎప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు
- మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: ఆంధ్రప్రదేశ్ చేపట్టనున్న బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారబోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గోదావరి -బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్లో ఉందని… ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాశారని అన్నారు. ఈ లేఖ వచ్చి దాదాపు 20 రోజులు దాటుతున్నా ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదని విమర్శించారు. హరీష్ రావు శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద జలాల మీద ప్రాజెక్టు ఎలా కడుతారని కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కమీషన్ల కోసం మౌనంగా ఉంటున్నారా?, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతావా?, స్వార్థం చూసుకుంటావా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంట్రాక్టుల్లో వాటా?, కమీషన్లు వస్తున్నాయా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సెప్టెంబర్ 17 రోజున కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అందులో 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే వాళ్లు 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని అన్నారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతం అన్నారు. అప్పుడు తెలంగాణ నష్టపోదా?. కింద గోదావరి, కర్ణాటక మీద కృష్ణా నీళ్లు ఆపితే తెలంగాణ పరిస్థితి ఏం కావాలి’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
అంటే 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ అర్పణం, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణం అయితే తెలంగాణ మిగిలేది ఏమిటి? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే మహారాష్ట్ర రాసిన లేఖలో తన అభ్యంతరాలను స్పష్టంగా చెప్పిందని… అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్ల కూడదని, ఒక వేళ వెళ్తే మహారాష్ట్ర వాట చెప్పాలని డిమాండ్ చేరసిందని అన్నారు. వరద జలాల మీద ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే వాళ్లు కూడా ప్రాజెక్టు కట్టేందుకు డీపీఆర్ పంపుతామని అన్నారని తెలిపారు. .ఏపీ, మహారాష్ట్ర గోదావరి నీళ్లు తీసుకుపోతం అంటున్నారని… కర్ణాటక కృష్ణా నీళ్లు ఆపుతం అంటుందని… అప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్రాలు ముందుకు పోతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంబీ, మినిస్టరీ ఆఫ్ ఫారెస్ట్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికే స్పష్టం చేశాయని హరీష్ రావు చెప్పారు. అప్పుడు తప్పు అన్న కేంద్రం ఇప్పుడు ఎందుకు ముందుకు పోతుందని ప్రశ్నించారు. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం ప్రాసెస్లో ఉందని కేంద్రం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడితో కేంద్రంలోని బీజేపీ తలొగ్గుతుందని ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేదా అని ప్రశ్నించారు. నిన్న ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం రూ. 9 కోట్లకు టెండర్లు పిలిచిందని అన్నారు. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని… దీనిని అడ్డుకోకుంటే రాష్ట్ర భవిష్యత్ ఆగం అవుతుందని అన్నారు.







