- జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక
- అభివృద్ధి పాలన Vs అరాచక పాలనకు జరుగుతున్న పోటీ
- సునిత నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మహా : గులాబీ పార్టీ జైత్రయాత్ర మరోసారి జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభం కాబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీతకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదని, అన్ని వర్గాల మద్దతు, అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదన్నారు. రెండేళ్ళ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని.. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదన్నారు. ఈ ఎన్నిక పదేండ్ల అభివృద్ధి పాలనకి.. రెండేళ్ళ అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అని పేర్కొన్నారు. పదేండ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్కు వెళ్ళేముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. సునిత గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. లక్షల మంది రైతన్నలు సునీత గెలుస్తుందని ఆశిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు చూస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారని అన్నారు. మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హైదరాబాద్లో నిర్మించిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతుందని వ్యాఖ్యానించారు






