Mahaa Daily Exclusive

  జీఎస్టీ ధమాకా.. రికార్డు కొనుగోళ్లు..కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్

Share

  • జీఎస్టీ ధమాకా.. రికార్డు కొనుగోళ్లు
  • మోదీ దీపావళి కానుక జీఎస్టీ సంస్కరణలు
  • ఇది భారత్ సాధించిన అతిపెద్ద విజయం
  • కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్

ఢిల్లీ, మహా: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సెప్టెంబర్‌ 22న తీసుకువచ్చిన సంస్కరణల వల్ల వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామన్నారు. అందువల్లే వినియోగదారులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో చేసిన కొనుగోళ్ల ద్వారా సంస్కరణల ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. జీఎస్టీ 2.0పై కేంద్రమంత్రులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.

రూ.20 లక్షల కోట్ల అదనపు వినియోగం..
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో దేశమంతా పండగ వాతావరణం నెలకొందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని పీయూష్ గోయల్ అన్నారు. జీఎస్టీ డబుల్‌ ధమాకాతో మోదీ దేశప్రజల ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువచ్చారన్నారు. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చాయని..వీటితో దేశంలోని అన్ని రంగాలు లాభపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణ సమయంలో దేశంలో వినియోగం, డిమాండ్ ఎలా పెరుగుతుందనే దాని గురించి అనేక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలో వినియోగం పెరుగుతోందని.. ఈ ఏడాది దాదాపు రూ.20 లక్షల కోట్ల అదనపు వినియోగం జరిగే అవకాశం ఉందని అన్నారు. అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేయడంలో భారత్‌ తన పొరుగు దేశాన్ని అధిగమించిందని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది దేశం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే పలు అతిపెద్ద కంపెనీలు వాటి తయారీలో దాదాపు 20శాతాన్ని భారత్‌లోనే చేపడుతున్నాయని పేర్కొన్నారు

Latest