- జూబ్లీహిల్స్@180
- ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు
- ముగిసిన నామినేషన్ల గడువు
- నేటి నుంచి పరిశీలన.. 24 వరకు విత్ డ్రాకు గడువు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ల దాఖలు పూర్తి చేశారు. ఇప్పటివరకు 180 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు 3 గంటల లోపు ఆర్వో ఆఫీస్ గేట్ లోపల ఉన్నవారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించారు అధికారులు. మంగళవారం మొత్తం 188 టోకెన్లు జారీ చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి.
24 వరకు నామినేషన్ల ఉపసంహరణ..
దాఖలైన నామినేషన్లను నేటి నుంచి ఆర్వో సాయిరాం పరిశీలించనున్నారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు








