బీహార్, మహా: బీహార్లో మహాఘట్బంధన్ తరఫు సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అశోక్ గెహ్లాట్ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నాయకుడు రాహుల్గాంధీలను సంప్రతించిన అనంతరం తేజస్వియాదవ్ను ప్రతిపక్ష కూటమి తరఫు సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవాలని నిర్ణయించామని గెహ్లాట్ పట్నాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. తేజస్వి యాదవ్ యువకుడని, ఆయనకు సుదీర్ఘ భవిష్యత్తు ఉన్నదని ఆయన అన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, అయినా అధికార ఎన్డీయూ కూటమికి పట్టింపులేదని గెహ్లాట్ విమర్శించారు. ఏన్డీయే సర్కారు పాలనాతీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కూడా ఎన్డీయే సర్కారు తీరుతో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు. అధికార కూటమి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుకుంటున్నారని చెప్పారు







