- రూ.86 కోట్ల భూమి కాపాడిన హైడ్రా
- కొండాపూర్ లో 4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్
- ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు
రంగారెడ్డి, మహా: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువైన భూమిని కాపాడింది. శుక్రవారం రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, ఆ దగ్గరలోనే ప్రజావసరాలకు ఉద్దేశించిన 4300 గజాల స్థలాన్ని శనివారం కాపాడింది. కొండపూర్, రాజరాజేశ్వరి నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీలో 4300 గజాల స్థలానికి కబ్జాల చెర నుంచి విముక్తి హైడ్రా విముక్తి కల్పించింది. 1978 లో వేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్లో మొత్తం 350 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ పాఠశాల భవనంతో పాటు ఇతర ప్రజావసరాల కోసం 4300 గజాల స్థలాన్ని అప్పట్లో లేఅవుట్ చేసిన చింతల పోచయ్య, ఆయన కుటుంబ సభ్యులు చూపించారు. అదే స్థలాన్ని లేఔట్ వేసిన పోచయ్య తో పాటు ఆయన కుటుంబ సభ్యుడు చింతల రాజు 3 భాగాలుగా విడదీసి లావాదేవీలు నిర్వహించడంలో కొళ్ల మాధవ రెడ్డి హస్తం ఉందని తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మకాలు చేశారంటూ వాపోయారు. కొళ్ల మాధవరెడ్డి కుమారుడు ఒక భాగాన్ని కొనగా.. చింతల పోచయ్య, చింతల రాజు పేరిట మీద రెండు భాగాలు ఉన్నట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మూడు భాగాల్లో కొళ్ల మాధవరెడ్డి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుని దందా నడుపుతున్నారు.
ఇదే విషయాన్ని కాలనీ ప్రతినిధులు జీహెచ్ఎంసీకి గతంలో ఫిర్యాదులు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలు నిజమే అని నిర్ధారించుకున్నాక హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం అక్కడ ఆక్రమణలను తొలగించింది. 4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. అలాగే అక్కడ భూమిని అమ్మిన పోచయ్య, రాజుతో పాటు స్థలాన్ని కొన్న కొళ్ల మాధవరెడ్డితో పాటు అతని కుమారుడిపైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులను నమోదు చేశారు







