Mahaa Daily Exclusive

  హరీశ్​రావుకు పితృ వియోగం

Share

  • హరీశ్​రావుకు పితృ వియోగం
  • తన బావకు నివాళులు అర్పించిన కేసీఆర్
  • సీఎం రేవంత్​, చంద్రబాబు, మంత్రులు​ సహా పలువురి సంతాపం
  • భారీగా తరలివచ్చిన లీడర్లు.. మహాప్రస్థానంలో ముగిసిన సత్యనారాయణ అంత్యక్రియలు

హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీశ్​రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్​లోని క్రిన్స్​విల్లాస్​లో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. పార్టీ నేతల సందర్శన అనంతరం ఫిల్మ్​నగర్​లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. హరీశ్​రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల బీఆర్​ఎస్​ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

బావతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్‌..
హరీశ్​రావు తండ్రి, కేసీఆర్​ బావ (7వ సోదరి, అక్క లక్ష్మి భర్త) తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే హరీశ్​రావుకు కేసీఆర్​ ఫోన్​ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతి పట్ల రెండు రాష్ట్రాల సీఎంలు సంతాపం..
తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్​ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. హరీశ్​రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంతాపం తెలిపిన కవిత.. ప్రముఖులు..
సత్యనారాయణరావు మృతి పట్ల కవిత సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని పార్థించారు. హరీశ్​రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. హరీశ్​రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్​రావు తండ్రి మృతిపట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం సత్యనారాయణ మృతి పట్ల​ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. హరీశ్​రావు కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. సత్యనారాయణ పార్థివదేహానికి ఎంపీ రఘునందన్‌రావు నివాళి అర్పించారు. హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయన తండ్రి పార్థివదేహానికి నివాళి అర్పించారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలు ఆయనను పరామర్శించారు.

ప్రచార కార్యక్రమాలు రద్దు..
మంగళశారం బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు చేశారు. హరీశ్‌రావు తండ్రి మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం, ఇవాళ బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాల రద్దు చేస్తున్నట్లు కేటీఆర్​ ప్రకటించారు.

Latest