- రైతు శ్రేయస్సే మోదీ ప్రభుత్వ ధ్యేయం
- రబీ సీజన్కు భారీ ఎరువుల సబ్సిడీ ఆమోదం
- కేంద్ర కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు
- తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వైఫల్యం
- కొనుగోలు కేంద్రాలు తెరవక రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన కాంగ్రెస్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, మహా : కేంద్ర క్యాబినెట్ రబీ సీజన్ 2025–26 (01.10.2025 నుండి 31.03.2026 వరకు) కాలానికి సంబంధించిన ఫాస్ఫేటిక్ మరియు పొటాషిక్ ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను నిర్ధారించిన నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులకు గొప్ప ఉపశమనం కలిగించేదని బీజేపీ రాషఅట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రబీ సీజన్ 2025–26 కోసం కేంద్రం సుమారు రూ. 37,952.29 కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా మోదీ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. ఈ నిర్ణయం వల్ల డి.ఏ.పీ, ఎన్పీకెఎస్ వంటి ఎరువులు రైతులకు సరసమైన ధరలకు సులభంగా లభిస్తాయని, రాబోయే రబీ సీజన్లో ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం సమయానికి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని, వారి శ్రమకు గౌరవం చేకూరేలా, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేలా కృషి చేస్తోందని వివరించారు. కేంద్రం ప్రతి సీజన్లో రైతుల అవసరాలను ముందే అంచనా వేసి ఎరువుల సబ్సిడీని నిర్ణయిస్తూ పెంపొందిస్తూ వస్తున్నదని, రైతు సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అయితే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం బాధాకరమన్నారు. పల్లెల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక ఆలస్యం చేస్తోందన్నారు. రైతులు తమ ధాన్యం అమ్ముకోలేక, తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
కేంద్రం రైతులకు సబ్సిడీ ఎరువులు అందించగా, రాష్ట్రం మాత్రం రైతుల పంట కొనకుండా వారిని కష్టాల్లోకి నెడుతోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. రైతుల శ్రేయస్సు, వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో స్థిరత్వం – ఇవన్నీ మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతుండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు ద్రోహి విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని విరుచుకుపడ్డారు







