హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కమ్మ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు అమీర్ పేట్ మైత్రీవనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో పాటు కమ్మ సంఘాల నాయకుల విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేశ్, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు







