హైదరాబాద్, మహా
మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆయనతో పాటు మరో మావోయిస్టు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న సైతం లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాశ్తో కలిసి పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బండి ప్రకాశ్, మావోయిస్టు పార్టీలో 45 సంవత్సరాలు వివిధ స్థాయిల్లో పని చేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్టమ్ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో మావోయిస్టులు లొంగిపోయారు
మావోయిస్టుల లొంగుబాటు వివరాలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టు నేత బండ ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ 45 సంవత్సరాలు వివిధ స్థాయిల్లో పని చేశారని తెలిపారు. అతని స్వస్థలం తెలంగాణలోని మందమర్రి అని, ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారని, 2004లో జరిగిన శాంతి చర్చల్లో ప్రకాశ్ పాల్గొన్నారని తెలిపారు. 2019లో స్టేట్ కమిటీ సభ్యుడయ్యారని, నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. 1980లో మావోయిస్టు మరో నేత పుల్లూరి ప్రసాదరావు కిషన్జీకి అనుచరుడిగా మారారని డీజీపీ తెలిపారు. 1981లో పీపుల్స్ వార్లో చేరి 1983లో కమాండర్ అయ్యారని, 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేశారని చెప్పారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు అయ్యారని, 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారని వివరించారు







