- పదేళ్లలో కేసీఆర్.. చిన్న ఇల్లు కట్టలె
- కమీషన్లపై ఆశతో కాళేశ్వరం ప్రాజెక్ట్ను కట్టారు
- రాష్ట్రంలో తాము 4 లక్షల పైగా ఇండ్లు మంజూరు చేశాం: పొంగులేటి
- మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి 300 మంది చేరిక
- రెహమత్ నగర్లో నవీన్ యాదవ్కు మద్దతుగా పాదయాత్ర
హైదరాబాద్, మహా: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు లక్షల పైగా ఇండ్లు మంజూరు చేశామని ఇందులో 3 లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్ డివిజన్లోని కార్మికనగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రయోజనం కలిగేలా ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలను సడలించామని తెలిపారు, గత పదేళ్లుగా పేదల కోసం ఒక్క చిన్న ఇల్లు కూడా కట్టని కేసీఆర్ కమీషన్లపై ఆశతో కాళేశ్వరం ప్రాజెక్ట్ను కట్టారని ఆరోపించారు.
పేదలందరికీ పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్దికోసం అహర్నిశలూ కష్టపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నేత జనార్ధనరెడ్డి పేదల కోసం కృషి చేశారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని అర్హులైన పేదలందరికీ పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. అంతేగాక గత ప్రభుత్వ హయాం నుంచి అసంపూర్తిగా ఉండిపోయిన రెండు పడక గదుల ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు చూసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 300 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న చేపల కృష్ణ, ఆనందరావు, ఫిలిం ఫెడరేషన్ నాయకుడు బసాడ కృష్ణ, లక్ష్మి తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి స్వాగతించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి నృత్యాలు, బాణాసంచాతో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్ధానిక కౌన్సిలర్ సీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నా







