Mahaa Daily Exclusive

  డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ డాక్టర్………

Share

  • వైద్య వృత్తికే కళంకం
  • డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ డాక్టర్
  • హైదరాబాద్‌లో కలకలం

హైదరాబాద్, మహా : వైద్యుడంటే దేవుడితో సమానం. అలాంటి వైద్యుడు వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించి పోలీసులకు చిక్కాడు. ముషీరాబాద్‌లో ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు మూడు లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కాగా.. ముగ్గురు యువకులతో కలిసి జాన్ పాల్ అనే డాక్టర్ ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్మకాలు సాగిస్తున్నారు. ముషీరాబాద్‌లో ఓ ఇంట్లో ఉంటూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నాడు. పక్కా సమాచారంతో డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ బృందానికి భారీగా డ్రగ్స్ లభించింది. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్‌ను చూసి ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు స్నేహితులు కలసి డ్రగ్స్ దందా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే యువకులు.. బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి డాక్టర్ జాన్‌పాల్ నివాసంలో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇందుకు డాక్టర్ సహకరించాడు. డాక్టర్ స్వయంగా డ్రగ్స్‌ వాడటంతో పాటు వాటిని అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. డ్రగ్స్ దందాపై సమాచారం అందిన వెంటనే ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ విజయ్ కృష్ణ, సిబ్బంది కలిసి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారని…. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు ప్రదీప్ తెలిపారు.

డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో 26.95 గ్రాముల ఓజి కుష్, 6.21 గ్రాముల ఎండిఎంఎ, 15 ఎల్‌ఎస్‌డి బాస్ట్స్, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాసిస్ ఆయిల్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని ఎస్ఐ బాలరాజు తెలిపాడు. అయితే డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరత్ లు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వీరిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఒక డాక్టర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడంపై సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం అభినందించారు

Latest