- మా వద్ద అన్నీ ఆధారాలున్నాయి
- ఎన్నికల చోరీ ద్వారే మోదీ ప్రధాని అయ్యారు
- ఈ విషయాన్ని జెన్ జీ యువతకు వివరిస్తా
- హెచ్-ఫైల్స్’ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కామెంట్స్
ఢిల్లీ, మహా: నరేంద్ర మోదీ ఎన్నికల చోరీలతో ప్రధానమంత్రి పదవిలోకి వచ్చారంటూ లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ వ్యవస్థీకృతంగా ఎన్నికల చోరీలకు పాల్పడుతోందని, ఈ నిజాన్ని దేశ యువత (జెన్ జీ) ముందు ఆధారాలతో సహా ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘హెచ్-ఫైల్స్’ మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, “మా దగ్గర చాలా ఆధారాలున్నాయి. ఈ ప్రక్రియను మేం కొనసాగిస్తాం. నరేంద్ర మోదీ ఎన్నికలను ఎలా దొంగిలించి ప్రధాని అయ్యారో జెన్ జీ యువతకు స్పష్టంగా వివరిస్తాం. బీజేపీ ఎన్నికలను దొంగిలిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు” అని తీవ్రంగా విమర్శించారు. నకిలీ ఓట్లు, ఓటర్ల జాబితాలో నకిలీ ఫొటోలు వంటి అంశాలపై తాను చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాహుల్ అన్నారు.
ఇప్పుడు బీహార్లోనూ అదే చేయబోతున్నారు..
బీజేపీ ఈసీని వెనకేసుకొస్తోందని, కానీ తాము చేసిన ఆరోపణలను మాత్రం ఖండించడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము చూపుతున్న ఆధారాలన్నీ ఈసీ నుంచి సేకరించినవే అని తెలిపారు. ఓటర్ల జాబితాలో బ్రెజిల్కు చెందిన లారిస్సా నెరీ అనే మహిళ ఫొటోను చేర్చడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని రాహుల్ అన్నారు. “అసలు సమస్య నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎన్నికల సంఘం కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తుండటం. ఒకే వ్యక్తి బహుళ ఓట్లు వేయడం, ఒకే బూత్లో ఒక మహిళకు 200 ఫొటోలు ఉండటం వంటివి జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గుజరాత్లలో ఇది జరిగింది. ఇప్పుడు బీహార్లోనూ అదే చేయబోతున్నారు” అని రాహుల్ ఆరోపించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ మహిళ లారిస్సా నెరీ కూడా ఒక వీడియో ద్వారా స్పందించారు. “భారత్లో ఎన్నికల కోసం ఎవరో నా పాత ఫొటోను వాడుకుంటున్నారు. అది నేను 18-20 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటో. నన్ను భారతీయురాలిగా చూపి ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆమె తన వీడియోలో పేర్కొన్నారు.







