Mahaa Daily Exclusive

  చేవెళ్ళ రోడ్డు ప్రమాదం ఎఫెక్ట్….అక్రమ వాహనాలకు అడ్డుకట్ట…

Share

  • చేవెళ్ళ రోడ్డు ప్రమాదం ఎఫెక్ట్
  • రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్
  • అక్రమ వాహనాలకు అడ్డుకట్ట
  • మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను రవాణాశాఖలోఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన పొన్నం ఇకపై రవాణాశాఖలోఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ప్రతిరోజు విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా ఆ రోజు చేయాల్సిన ఎన్ ఫోర్స్ మెంట్ ప్రాంతాలపై ఆయా బృందాలకు ఉదయం ఆరు గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుండి సమాచారం తెలపనున్నారు. ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు మినరల్ ట్రాన్స్ ఫోర్ట్‌ లో సాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై ఈ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేసేలా చర్యలు తీసుకోనున్నారని మంత్రి తెలిపారు.

ఒక్కో ఎన్ ఫోర్స్ మెంట్ బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారని. ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లను వేధింపులకు గురి చేయరాదని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గతవారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యలపై మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆరా తీశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమీషనర్ ఇలంబర్తి, జెటిసిలు రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.