- నేడు సీఎంగా నితీశ్ ప్రమాణం
- బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి బాద్యతలు
- పట్నాలోని గాంధీ మైదాన్లో ఏర్పాట్లు సిద్ధం
- హాజరుకానున్న మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు
బిహార్, మహా: బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. తమ కూటమి నేతగా నీతీశ్ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలిసి రాజీనామా సమర్పించారు. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ పదోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. పట్నాలోని గాంధీ మైదాన్ వేదికగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్లతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ నేత ప్రేమ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పదవి జేడీయూ అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే పక్షాలనడుమ అంగీకారం కుదినట్లు తెలిసింది.
మంత్రి పదవుల కోసం పైరవీలు..
మంత్రివర్గానికి సంబంధించి ఎన్డీయే కూటమిలో మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ పదవుల కోసం నేతలు ముమ్మర లాబియింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు సామ్రాట్ ఛౌదరీ, విజయ్ సిన్హాలు ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నూతన కేబినెట్లో ఐదు నుంచి ఆరు కొత్త ముఖాలు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేడీయూ నుంచి ప్రస్తుత మంత్రులే కొనసాగనుండగా.. బీజేపీలో మాత్రం కొత్తవారికి చోటు దక్కనున్నట్లు తెలిసింది. వీరితోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.






