Mahaa Daily Exclusive

  రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదు….

Share

  • రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదు
  • పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • గవర్నర్లకు విచక్షణ.. కానీ అపరిమిత అధికారం కాదు

న్యూఢిల్లీ, మహా : శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు సంచలన సమాధానాలు తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఈ ధర్మాసనం బిల్లుల ఆమోదంపై గడువును విధించడం రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చందూర్‌కర్‌లు ఉన్నారు. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావని, ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాతే న్యాయ సమీక్షను అభ్యర్థించవచ్చని కోర్టు ఉద్ఘాటించింది.

తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రాజ్యాంగపరమైన చిక్కులు తలెత్తాయి. ముఖ్యంగా ఆ తీర్పు ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులు ఆమోదించడానికి గడువు విధించింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరుతూ రిఫరెన్స్ పంపారు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్‌లు తమ అధికారాల నిర్వహణ విషయంలో ఏ కోర్టుకు జవాబుదారీగా ఉండరని ఉదహరించారు. అలాగే ఆర్టికల్ 200 కింద బిల్లును తన ముందు ఉంచినప్పుడు.. మంత్రుల మండలి అందించే సహాయం, సలహాకు గవర్నర్ కట్టుబడి ఉంటారా? అని కోర్టును ప్రశ్నించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం కీలక తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తన తీర్పులో పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించి గడువు విధించడం రాజ్యాంగానికి విరుద్ధమని తేల్చి చెప్పింది. అలాగే గవర్నర్ల అధికారాలపై పూర్తి స్పష్టతను ఇచ్చింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని ధర్మాసనం వివరించింది. “గవర్నర్లు తమ అపరిమిత అధికారాలను వినియోగించలేరు. ఆర్టికల్ 200 కింద వారికి విచక్షణ అధికారం ఉంటుంది. కానీ ఆ విచక్షణ హేతుబద్ధంగా ఉండాలి” అని కోర్టు వివరించింది.

Latest