- ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షలు
- బంపరాఫర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- పంచాయతీ ఎన్నికల వేళ కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక రకంగా పంచాయతీలకు బంపరాఫర్ అనే చెప్పవచ్చు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ప్రజలంతా కూర్చుని.. చర్చించుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటే.. అలాంటి గ్రామ పంచాయతీలకి రూ. 10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఓట్ల సవరణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈనెల 23వ తేదీ వరకు ఓటర్ల జాబితాను గ్రామాల్లోనే సవరించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. పంచాయతీల రిజర్వేషన్ల జాబితాను కూడా ఈసీ విడుదల చేసింది. దీంతో గ్రామాల్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఆషావహులు ఎవరికి వారుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజకీయ పార్టీలు కూడా అందుకు అనుగుణంగా సన్నద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల చేసిన ప్రకటన గ్రామాభివృద్ధికి దోహపడేదిగా ఉండటంతో ఏకగ్రీవ ఎన్నిక కోసం గ్రామాలలో ప్రయత్నాలు ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి. సర్పంచ్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఏకంగా గ్రామానికి గ్రాంట్ కింద రూ. 10 లక్షలు విడుదలైతే గ్రామాన్ని ఆదర్శవంతమైనదిగా తీర్చిదిద్దుకోవచ్చన్న చర్చ గ్రామాలలో జోరందుకుంది.








