Mahaa Daily Exclusive

  గుడ్‌న్యూస్ … తెలుగు సహా 7 భాషల్లో… ఫ్రీగా 482 టీవీ ఛానెళ్లు 48 రేడియో ఛానెళ్లు…

Share

హైదరాబాద్, మహా: ప్రాంతీయ భాషా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో మీడియా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను పెంచేందుకు.. కీలక ముందడుగు వేసింది. ప్రసార భారత ఆధ్వర్యంలో నడుస్తున్న డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌ నుంచి.. ప్రాంతీయ భాషా ఛానళ్లను ఉచితంగా ప్రసారం చేసే అవకాశాన్ని కల్పించే పైలట్ పథకాన్ని ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమలు చేయనున్నారు. భారతదేశంలో మీడియా అందుబాటును, ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను పెంచేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసార భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత డీటీహెచ్ ప్లాట్‌ఫామ్ డీడీ ఫ్రీ డిష్ వేదికపై ప్రాంతీయ భాషా చానెళ్లకు ఉచితంగా ప్రసార అవకాశాన్ని కల్పించే పైలట్ పథకాన్ని ప్రారంభించింది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రాతినిధ్యం లేని లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలకు చేరువయ్యే లక్ష్యంతో డీడీ ఫ్రీ డిష్ ప్లాట్‌ఫామ్‌లో ఎంపీఈజీ -4 స్ట్రీమ్స్‌పై ప్రముఖ ప్రాంతీయ భాషా చానెళ్లను చేర్చడానికి ప్రసార భారతి ఒక పైలట్ పథకాన్ని ప్రారంభించిందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో.. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారా సమాచార, అవకాశాలు, అవగాహనలో ఇప్పటివరకు ఉన్న అంతరాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా తెలుగు సహా మొత్తం 7 భాషల్లో ఛానెళ్లను ప్రసారం చేయనున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, బంగ్లా, అస్సామీ, ఒడియా భాషలకు చెందిన 482 టీవీ ఛానెళ్లు, 48 రేడియో ఛానెళ్లను ఉచితంగా ప్రసారం చేయనున్నారు.

ముఖ్యంగా ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో ప్రాంతీయ వార్తా ఛానెళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ స్లాట్‌లను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా కేటాయించనున్నారు. దేశంలో 6.50 కోట్ల ఇళ్లకు చేరువైన డీడీ ఫ్రీ డిష్.. ఈ పథకం ద్వారా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను బలోపేతం చేస్తుందని ప్రసార భారతి స్పష్టం చేసింది.

Latest