- సీఎం ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తుంటే ఈసీ నిద్రపోతుందా?
- విద్యుత్ శాఖను నడుపుతున్నది తెలంగాణా.. ఏపీనా?
- నేను కమీషన్లు తీసుకోవటంలో మాత్రమే అనిఫిట్
- మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా: ధర్మల్ విద్యుత్ను తగ్గిస్తామన్న ప్రభుత్వం.. కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమికొట్టాలని హెచ్చరించారు. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ.. రూ.4.12పైసళ్లకు యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రాలేదు? అని నిలదీశారు హరీశ్రావు.
ఎన్టీపీసీ ఇచ్చే తక్కువ ధర కరెంటును కాదని.. సొంతంగా విద్యుత్ ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తామని అంటున్నారని ప్రశ్నించారు. రామగుండం విద్యుత్ ప్రాజెక్టుతో ప్రజలపై రోజుకు రూ. 9కోట్లు భారం పడుతోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ రంగంలో ఈ దుస్థితి నెలకొందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 50వేల కోట్ల స్కాం బయట పెట్టినందుకే తనను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారని ఆరోపణలు చేశారు. కమీషన్లు తీసుకోవటంలో మాత్రమే తాను అనిఫిట్ అని చెప్పుకొచ్చారు హరీశ్రావు. విద్యుత్ శాఖను తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా..? లేదా ఏపీ ప్రభుత్వం నడుపుతుందా? అని ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖలో తిష్టవేసుకుని కూర్చున్న ఆంధ్ర ప్రాంత అధికారులను వెంటనే సాగనంపాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను సీఎం పరోక్షంగా ప్రభావితం చేస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. పట్టణాల్లో సీఎం తిరుగుతానంటే ఎలా అని ప్రశ్నించారు.







