హైదరాబాద్, మహా : సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్పై ఇద్దరు ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం పిటిషనర్ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో సికింద్రాబాద్లోని రాంగోపాల్పేటకు చెందిన వడ్డం శ్యామ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వెంటనే అడిగిన సమాచారం ఇవ్వాలని నవంబర్ 24న ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని శ్యామ్ మరోసారి కోర్ట్ను ఆశ్రయించారు. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం.. ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై మండిపడింది. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా కోర్ట్ ఉత్తర్వులు పాటించకపోతే జరిమానా విధిస్తామని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది.






