- పశువుల్లా ఎక్కించడమేంటీ
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో సినీ నటుడు నరేష్ గొడవ
- నిర్లక్ష్యం వీడని ఇండిగో విమానయాన సంస్థ
హైదరాబాద్, మహా : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో సినీ నటుడు నరేష్ గొడవకు దిగారు. విమానం దగ్గరికి తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా ఎక్కించడమే కాకుండా.. వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత ధోరణిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎయిర్లైన్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు కూడా నరేష్కు మద్దతుగా నిలుస్తున్నారు.
దేశ విమానయాన రంగంలో 65 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగి ఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్లో తీవ్ర సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ వైఫల్యంతో ఇండిగో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. రోజుల తరబడి ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో వెయిట్ చేయలేక నరకయాతన అనుభవించారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రయాణకులు మండిపడ్డారు. ఇదిలా ఉండగానే.. ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్వాహణ సరిగ్గా లేదంటూ సినీ నటుడు నరేష్ ఏకంగా సిబ్బందితో గొడవకు దిగారు.








