Mahaa Daily Exclusive

  స్పీకర్ వైఖరి ఏకపక్షం.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం: బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం

Share

  • మాకొద్దీ ఆసెంబ్లీ మేం రాము
  • మారు మైక్ ఇవ్వడం లేదు
  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం
  • బీఆర్ఎస్ ఉప నేత హరీష్ రావు
  • స్పీకర్ వైఖరి ఏకపక్షంగా ఉందని ఆరోపణ
  • మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రటన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్‌ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలోనే మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అయితే సీఎం ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

స్పీకర్ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని దుయ్యబట్టారు. “శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశానికి మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. ఈ సమావేశంలో సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్ళీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం కానీ, సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు స్పీకర్ గారు సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా మా బాధ్యత. క్వశ్చన్ అవర్‌లో 10 ప్రశ్నలు ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మా మైక్ కట్ చేశారు” అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించ లేదా? మరి ఇక్కడ మేము సీఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారు? ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి. ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? మమ్మల్ని ఎందుకు పిలిచినట్లు? మూసీ ప్రక్షాళన కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందిసభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీని సీఎల్పీ మీటింగ్‌లా, గాంధీ భవన్‌లా మార్చేశారు సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్లే సొల్లు వాగుడు వాగుతున్నారు” అని హరీశ్ రావు ఆక్షేపించారు. “కేసీఆర్ పై సీఎం వాడిన భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వే అసలైన తెలంగాణ ద్రోహివి, తెలంగాణ నీటి ద్రోహివి. మూసీపై చర్చకు మేము సిద్ధం. షార్ట్ డిస్కషన్ పెట్టండి, రోజంతా చర్చిద్దాం. కానీ క్వశ్చన్ అవర్‌లో సీఎం వచ్చి గంటన్నర సేపు అడ్డగోలుగా మాట్లాడితే ఎలా? మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్నసాగర్ నుంచి తెస్తున్నారా అని అడిగాము దానికి సమాధానం చెప్పలేదు. మూసీలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరాము. వీటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు” అని హరీశ్ రావు చెప్పారు.

“రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు అవినీతికి ఆఫిషియల్ గా రేట్లు పెట్టి మరీ పెంచిన రేవంత్ రెడ్డికి మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.సభలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు.స్పీకర్ తీరుకు, ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నాం” అని హరీశ్ రావు ప్రకటించారు.

Latest