Mahaa Daily Exclusive

  కేసీఆర్ మౌనం వీడాలి.. అసెంబ్లీకి రావాల్సిందే: స్వపక్ష నేతలపైనే ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Share

  • కేసీఆర్ ఇకనైనా మౌనం వీడాలి
  • బీఆర్ఎస్‌ను మళ్లీ టార్గెట్ చేసిన తెలంగాణ జాగృతి చీఫ్
  • హరీశ్ రావును టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత
  • కేసీఆర్ ను ఉరి తీయాల్సి వస్తే రేవంత్ ను రెండు సార్లు ఉరి తీయాలని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ కూడా రేవంత్ వాడిన భాషను ఖండించింది. ఈ విషయంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్‌చాట్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు.. రెండుసార్లు ఉరి తీయాలని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారన్నారు. ఉద్యమ నాయకుల గురించి ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు. ఈ సందర్భంగా ఇకనైనా కేసీఆర్ మౌనం వీడాలని కవిత కోరారు.

అధికార పక్షం నోరు మూయించాలి

ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనాలని కవిత కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడి.. అధికార పక్షం నోరు మూయించాలని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ లీడర్లను మరోసారి టార్గెట్ చేశారు కవిత. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని.. హరీశ్ రావును ఉద్దేశించి విమర్శించారు. బీఆర్ఎస్‌లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మనుగడ సాగించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు కవిత.

పిల్ల కాకులకేం తెలుసు

నదీ జలాల విషయాన్ని పిల్లకాకులకు వదిలేయవద్దని.. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత అన్నారు. అంతేకాకుండా ఆర్థిక శాఖలో ఒక్కో ఫైల్ 9 నెలలుగా పెండింగ్‌లో ఉందని విమర్శించారు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్‌పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని.. ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగాణలో లేదని కవిత ఘాటుగా విమర్శించారు. ఇక భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అయితే బీఆర్ఎస్‌కు గడ్డుకాలం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అందుకే పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందని తేల్చి చెప్పారు.

అందుకే అసెంబ్లీకి వచ్చాను

కాగా, తాను ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3వ తేదీనే రాజీనామా లేఖ సమర్పించానని చెప్పిన కవిత.. దాన్ని ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరేందుకు అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. మండలిలో చివరిసారిగా మాట్లాడేందుకు అనుమతి కోరానని తెలిపారు.

Latest