హైదరాబాద్, మహా : మంత్రి సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ-జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 25వరకు దేశవ్యాప్తంగా ‘ఎంజీనరేగా బచావో సంగ్రాం’ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ అధిష్ఠానం 9 మంది సభ్యులతో జాతీయస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది. సీనియర్ నేత అజయ్ మాకెన్ సమన్వయకర్తగా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యురాలిగా తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క నియమితులయ్యారు. మాజీ కేంద్రమంత్రి జైరాంరమేష్, మాజీ ఎంపీలు సందీప్ దీక్షిత్, ఉదిత్రాజ్, కర్ణాటకమంత్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కుమారుడు ప్రియాంక్ఖర్గే, ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దీపికా పాండేసింగ్, రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఛైర్పర్సన్ సునీల్పన్వర్, యూత్కాంగ్రెస్ ఇన్ఛార్జి మనీష్శర్మలు ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. కీలక నేతలున్న కమిటీలో సీతక్కకు స్థానం కల్పించడంపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.







