Mahaa Daily Exclusive

  నవదీప్‌పై డ్రగ్స్ కేసు కొట్టివేత..! ఆధారాలు దొరకలేదన్న తెలంగాణ హైకోర్టు..

Share

హైదరాబాద్, మహా : డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన కేసులో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం కాలేదని, కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెబుతూ నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, అతడిని అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తూ కేసును రద్దు చేసింది. దీంతో నవదీప్‌కు న్యాయపరమైన ఉపశమనం లభించింది.

 

ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు నవదీప్ పేరు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించిన విచారణలో భాగంగా గుడిమల్కాపూర్‌లో జరిగిన ఒక ఆపరేషన్ సమయంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో నవదీప్ పేరు చేర్చడంతో, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న ఆరోపణలు, పరారీలో ఉన్నాడన్న కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో నవదీప్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆయన సన్నిహితులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ వార్తలపై స్పందించిన నవదీప్, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, తాను ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని వెల్లడించారు. పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న భయంతో, ముందస్తు రక్షణ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని తొలుత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసు వివరాలను పూర్తిగా పరిశీలించిన కోర్టు.. డ్రగ్స్ స్వాధీనం కాలేదన్న అంశాన్ని కీలకంగా పరిగణనలోకి తీసుకుంది.

 

న్యాయవాది వెంకట సిద్ధార్థ్ వాదనల ప్రకారం, నవదీప్ పేరు కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే ఉంది తప్ప, అతని వద్ద నుంచి ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని, ప్రత్యక్ష ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం, కేసును కొనసాగించడానికి సరైన ఆధారాలు లేవని తేల్చి, డ్రగ్స్ కేసును పూర్తిగా కొట్టివేసింది. దీంతో గత కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితి నుంచి నవదీప్ బయటపడ్డాడు.

 

ఇక నవదీప్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన నటనతో మెప్పించారు. ఇటీవల ఓటీటీ ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజా హైకోర్టు తీర్పుతో వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ ఆయనకు ఇది పెద్ద ఊరటగా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.