మహా
: అయోధ్య రామ మందిరంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు విచారించగా.. శ్రీనగర్కు చెందిన వ్యక్తిగా తేలింది. ఇతడితోపాటు ఆలయ సమీపంలోని పలువురు వ్యాపారస్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆలయ భద్రతపైనా ఆయా విభాగాలు సమీక్షించాయి. జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబ్దుల్ అహద్ షేక్.. శనివారం ఉదయం అయోధ్య ఆలయంలోకి ప్రవేశించాడు. కొద్దిసేపటి తర్వాత ఆలయంలోని ఓ ప్రదేశంలో ప్రార్థనలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడి తీరును గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా జమ్మూలోని అతడి నివాసానికి వెళ్లిన స్థానిక పోలీసులతో కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఇంటిదగ్గర ఎక్కువ రోజులు ఉండడని, అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పినట్లు తెలిసింది.







