- అలా చేస్తే ట్రంప్కు కూడా మద్దతిస్తా
- ఉద్ధవ్ థాకరేతో పొత్తుపై రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు
మహా
మహారాష్ట్ర, మరాఠీ భాషాభివృద్ధికి సహకరిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సైతం మద్దతు ఇవ్వడానికి వెనుకాడబోనని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత బీఎంసీ ఎన్నికల కోసం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కలిసి పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే ఆంగ్ల మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మరాఠీ ప్రజల సంక్షేమం, మరాఠీ భాష పరిరక్షణ, బలమైన మహారాష్ట్ర అనే అంశాలు తనకు అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. మరాఠీని శాస్త్రీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఆయన విమర్శించారు.







