- హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారన్న ఒవైసీ
- ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- ముందు బురఖా ధరించిన మహిళను ఎంఐఎం అధ్యక్షురాలిని చేయాలని సవాల్
- ఎంతమంది ముస్లిం మహిళలకు ఎంఐఎం టికెట్లు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్న
- ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు బీజేపీ న్యాయం చేసిందని వెల్లడి
- సాధికారత అంటూనే ఒవైసీ మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, మహా : భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు, బురఖా ధరించిన మహిళను మీ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం చూపాలని ఆయన ఒవైసీకి సవాల్ విసిరారు. ఆదివారం ‘ఎక్స్’ వేదికగా బండి సంజయ్ ఈ మేరకు స్పందించారు. “ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చింది? పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం నినాదాలతో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్టు కాదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ తరఫున షాజాదీ సయ్యద్ను నిలబెట్టామని, అప్పుడు ఆమెను బెదిరించి ఓడించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జాతీయ మైనారిటీ కమిషన్లో సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. సాధికారత గురించి మాట్లాడే ఒవైసీ, పార్టీలోనూ, ఇంట్లోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తారని సంజయ్ విమర్శించారు. ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల పేరిట సంక్షేమ పథకాలు, గ్యాస్ కనెక్షన్లు, గృహాలు వంటి సంస్కరణలతో ముస్లిం మహిళలకు నిజమైన సాధికారతను అందించింది బీజేపీ ప్రభుత్వమేనని సంజయ్ పేర్కొన్నారు. చాలామంది ముస్లిం మహిళలు ప్రధాని మోదీని తమ సోదరుడిగా భావిస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హోదా కల్పించిందని, అందుకే పాకిస్థాన్లా కాకుండా ఇక్కడ హిజాబ్ ధరించిన మహిళ కూడా ప్రధాని కాగలరని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే








