Mahaa Daily Exclusive

  పార్టీ ఫిరాయింపుల కేసు: తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది హెచ్చరిక

Share

  • పార్టీ ఫిరాయింపుల కేసు
  • స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • ఇదే చివరి అవకాశమంటూ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మహా : తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం రెండు వారాల్లోగా తేల్చకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై చర్యలు తీసుకున్నా, మిగతా వారిపై ఇంకా నిర్ణయం రాకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చివరి అవకాశమని స్పష్టం చేసింది. లేదంటే తామె నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా.. లేదంటే తామే నిర్ణయం తీసుకోవాలా అని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పీకర్‌కు మరో అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్పీకర్ తరఫు న్యాయవాది ఇప్పటివరకు స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను కోర్టుకు విన్నవించారు. మిగతా వారిపై నిర్ణయం తీసుకోకపోవడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఈ క్రమంలో స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ వాదనలను వినిపిస్తూ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కు కంటి ఆపరేషన్ జరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారన్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ, నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుందని ధర్మాసనానికి వివరించారు. దీంతో ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. స్పీకర్ రెండు వారాల్లోగా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అందులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పురోగతిని వివరించాలని సూచించింది. రెండు వారాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది. మిగిలిన కేసుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తే, అదనపు సమయం గురించి తర్వాత ఆలోచిస్తామని సుప్రీంకోర్టు బదులిచ్చింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌లపై అనర్హత పిటిషన్లపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఇతర కేసుల్లో, పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో స్పీకర్ వారి పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలలోని లోపాలను ఈ దశలో తాము పరిశీలించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ప్రత్యేక న్యాయ ప్రక్రియల ద్వారా లేవనెత్తాలని సూచించింది