Mahaa Daily Exclusive

  మావోయిస్టుల లొంగుబాటులో సరికొత్త రికార్డు: 2025లో 576 మంది జనజీవన స్రవంతిలోకి!

Share

  • అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు అండగా తెలంగాణ పోలీస్ శాఖ
  • 2025 వ సంవత్సరంలో 576 మంది లొంగుబాటు

హైదరాబాద్, మహా : అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తుంది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే లొంగిపోయి గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేరుగా పర్యవేక్షిస్తోంది.
1980లో పీపుల్స్ వార్ (ప్రస్తుత సీపీఐ–మావోయిస్ట్) ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది ఏకంగా 576 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాస ప్యాకేజీలో భాగంగా స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించారు.
“పోరు వద్దు – ఊరు ముద్దు. అజ్ఞాతం వీడి జనంలోకి రండి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తాం” అని మిగిలిన మావోయిస్టులను రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది. తెలంగాణ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మావోయిస్టు క్యాడర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి .

1 ముప్పాళ్ల లక్ష్మణ్ రావు @ గణపతి – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు.

2.తిప్పిరి తిరుపతి @ దేవ్జీ – జనరల్ సెక్రటరీ, రివార్డు రూ.25 లక్షలు.

3.మల్లా రాజి రెడ్డి @ సంగ్రామ్ – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు.

4.పుసునూరి నరహరి @ సంతోష్ – సీసీఎం , ఈఆర్‌బీ సభ్యుడు (జార్ఖండ్‌లో కార్యకలాపాలు), రివార్డు రూ.20 లక్షలు.

5.ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.

6.వార్తా శేఖర్ @ మంగ్తు – డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు.

7.జోడే రత్నబాయి @ సుజాత – సీసీఎం , డీకేఎస్‌జెడ్‌సీ ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు.

8.లోకేటి చందర్ రావు @ ప్రభాకర్ – వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.

9.బడే చొక్కారావు @ దామోదర్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు.

10.నక్కా సుశీల @ రేలా, డీసీఎం స్థాయి కేడర్ రివార్డ్ 5 లక్షలు
11.జాడి పుష్ప @ రాజేశ్వరి – డీసీఎం స్థాయి కేడర్లు, రివార్డు రూ.5 లక్షలు చొప్పున.

12..రంగబోయిన భాగ్య @ రూపి, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4. లక్షలు
13.బాదిషా ఉంగ @ మంతు ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు నాలుగు లక్షలు
14.మడివి అడుమె @ సంగీత, ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు 4 లక్షలు
15. కాశపోగు భవాని @ సుగుణ ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4 లక్షలు,
16. కుంజం ఇడమల్ – ఏరియా కమిటీ స్థాయి కేడర్లు, రివార్డు రూ.4 లక్షలు చొప్పున.
17.ఉతిమి అనిల్ కుమార్ @ భగత్ సింగ్ – పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్, రివార్డు రూ.1 లక్ష.