- అభివృద్ధి మా విధానం…. హిందుత్వం మా నినాదం
- కేంద్ర నిధులతోనే కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో అభివృద్ధి
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా ఇవ్వలేదు
- బీఆర్ఎస్ కు ఓటేయడం దండగ
- బీజేపీని ఆశీర్వదించి అత్యధిక స్థానాల్లో గెలిపించండి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మహా : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అభివృద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. విజయగణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే సాధ్యమైందని తెలిపారు. స్మార్ట్ సిటీ, అమృత్ 1, 2, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతోపాటు 14, 15, 16వ ఆర్ధిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ‘‘అభివృద్దే మా విధానం… హిందుత్వమే మా నినాదం’’ పేరుతో ప్రజల వద్దకు వెళతామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియడంతో ఓట్ల కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో కాంగ్రెస్ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఏం లాభమని, గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. బీజేపీని ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకురావడంతోపాటు సీఎస్సార్ నిధులను సైతం తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి.శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బీజేపీ జమ్మికుంట నేతలు ఆకుల రాజేందర్, పుప్పాల రఘు తదితరులు పాల్గొన్నారు.








