Mahaa Daily Exclusive

  ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు..! పోలీసులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..!

Share

  • ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదు
  • పోలీసులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
  • ముగింపు పలకాలని కోరిన ఎమ్మెల్యే

 

హైదరాబాద్, మహా : పోలీసు ఉన్నతాధికారిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్యనీయాంశమయ్యాయి. దీంతో ఆయనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. దీంతో పోలీసులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు కోరారు. కరీంనగర్ సీపీని కులం పేరుతో దూశిస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు. దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం వివరణ ఇచ్చారు. ఒకవేళ ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ వివాదాన్ని కొందరు అనవసరంగా పెద్దది చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ వివాదం వెనుక గల కారణాలను వివరిస్తూ.. తాము కుటుంబంతో కలిసి సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో కొందరు అధికారులు కావాలని తమను అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్ కారణంగానే తన నోరు జారిందని, అంతేకానీ పోలీసు వ్యవస్థ అన్నా, అధికారులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని ఇకపై సాగదీయకుండా ఇంతటితో ముగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొద్దిరోజులుగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, పోలీసులు నిరసన తెలపడంతో కౌశిక్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.