Mahaa Daily Exclusive

  దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ..!

Share

  • దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ
  • హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్
  • వాదనలను వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డి
  • విచారణ ఫిబ్రవరి 18 కి వాయిదా

 

హైదరాబాద్, మహా : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ నుంచి దానంపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ కార్యాలయంలో హాజరై తన వాదనలు వినిపించారు. స్పీకర్ ప్రసాద్ వారి నుంచి స్టెట్మెంట్ తీసుకున్నారు. దానం పార్టీ ఫిరాయించారనడానికి ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడమే సాక్ష్యమని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి స్పీకర్ ను కోరారు. దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు. బీజేపీ నుంచి అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఏలేటి మహేశ్వ్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేయాలని స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు.

 

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో భాగంగా అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్యల పిటిషన్లను విచారించిన స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీలు మారారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసింది. కానీ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ల విచారణ పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ ను సుప్రీంకోర్టు వివరణ కోరింది. విచారణ పూర్తి చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించింది.