Mahaa Daily Exclusive

  అమరావతికి బిల్‌ గేట్స్: ఫిబ్రవరి 18న సీఎం చంద్రబాబుతో భేటీ.. క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులే లక్ష్యం!

Share

  • అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు
  • 2 వారాల్లో అమరావతికి బిల్ గేట్స్
  • సీఎం చంద్రబాబుతో కీలక భేటీ

పెట్టుబడులకు ఛాన్స్!

అమరావతి, మహా : అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్‌ గేట్స్ మరో రెండు వారాల్లో ఏపీకి రానున్నారు. ఫిబ్రవరి 18న బిల్‌గేట్స్ అమరావతికి రానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఏపీ ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలు, ముఖ్యంగా సాంకేతిక రంగంలో పరస్పర సహకారంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, వ్యవసాయం, విద్య, ఉపాధి రంగాలలో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించడానికి ఇదివరకే ఒప్పందాలు చేసుకుంది. 2025 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ఏఐ టెక్నాలజీ వినియోగంతో పాటు రియల్ టైమ్ డేటా వ్యవస్థలను అమలు చేయడంలో చంద్రబాబు విజన్‌ను బిల్ గేట్స్ ప్రశంసిస్తూ లేఖ సైతం రాశారు. ముఖ్యంగా హెల్త్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..

బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా సాగుతోంది. అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీలో ఈ అంశంపై ప్రతిపాదన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఏపీ ఐటీ రంగానికి ఇది మరింత ప్లస్ అవుతుంది. పలు రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి టెక్నాలజీ సహకారంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన అంశంపై బిల్ గేట్స్ పర్యటన రోజు స్పష్టత రానుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రబాబుకు బిల్ గేట్స్‌తో ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. బిల్ గేట్స్ అభిమానించే నేతలలో చంద్రబాబు ఒకరని తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ అధినేతను సీఎం చంద్రబాబు ఆశ్చర్యపరిచారు. అనంతరం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ రావడానికి ఆ ఘటన కారణమైంది. హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఒక చారిత్రాత్మక అడుగు అది. దేశంలో ఐటీ రంగంలో ముఖ్యంగా హైదరాబాద్ సైతం ఐటీ హబ్‌గా మారేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు ఏపీలోనూ క్యాంపస్ ఏర్పాటు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు చేయనున్నారు.