Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌కు యాపిల్ రిటైల్ స్టోర్: ఉద్యోగ నియామకాలు ప్రారంభం.. 2027లో ఓపెనింగ్!

Share

  • హైదరాబాద్‌లో ‘యాపిల్’ రిటైల్ స్టోర్‌
  • ధేశవ్యాపతంగా ఇప్పటికే ఐదు స్టోర్లు
  • హైదరాబాద్ లో ఆరవ స్టోర్ కు నిర్ణయం
  • మొదలైన ఉద్యోగుల నియామక ప్రక్రియ

హైదరాబాద్, మహా : ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీ భారత్‌లో రిటైల్‌ స్టోర్స్‌ని విస్తరిసించే పనిలో పడింది. గత ఏడాది బెంగళూరు, పూణె, నోయిడాలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆ సంస్థ కొత్తగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది.
కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభించే పనుల్లో భాగంగా కీలకమైన రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయనుంది. స్టోర్‌ లీడర్, సీనియర్‌ మేనేజర్‌ తో పాటు ఇతర ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. ఇందుకు సంబంధించి సంస్థ కెరీర్ పోర్టల్‌లో ఓ పోస్ట్‌ చేసింది. సాధారణంగా స్టోర్‌ని ప్రారంభించడానికి యాపిల్‌ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్‌మెంట్‌ చేపడుతుంది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌ లో 2027లో రిటైల్ స్టోర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. అంతేకాకుండా ముంబైలో ఈ ఏడాది మరో స్టోర్ ను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాల్యూమ్ పరంగా భారత్ లో టాప్ ఐదు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో తన స్థానాన్ని మరింత బలపరచుకోవడమే లక్ష్యంగా యాపిల్ కంపెనీ ఈ విస్తరణ చేపడుతున్నట్లు పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్‌లో ఆపిల్ రిటైల్, పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ’బ్రియన్ మనీకంట్రోల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ భారత్ లో తదుపరి దశ రిటైల్ విస్తరణతో ఆపిల్‌కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. 25 సంవత్సరాలకు పైగా మంచి ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నామని వివరించారు. 2020లో ఆన్‌లైన్ స్టోర్‌తో భారత్ లో యాపిల్ కంపెనీ తన రిటైల్ ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023లో ముంబై, ఢిల్లీలో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఆ తర్వాత బెంగళూరు, పూణే, నోయిడాలో స్టోర్‌లను ప్రారంభించింది. మొత్తంగా దేశంలో 5 యాపిల్ స్టోర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో ముంబైలో మరో స్టోర్ ప్రారంభిస్తే ఈ సంఖ్యకు ఆరుకు చేరుకుంటుంది. భారత్ లో యాపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. రిటైల్ అనుభవంతో పాటు మంచి నాణ్యతతో కూడిన ఉత్పతులు ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. అమ్మకాల సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూనే ఉంది.