- జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ కేసు
- ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్
- డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
న్యూఢిల్లీ, మహా : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది., తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు మంగళవారం వెలువరించిన తీర్పుతో ఆమె దాదాపు పదేళ్లుగా ఎదుర్కొంటున్న ఈ న్యాయపోరాటంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నట్లు అయింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేయడానికి నిరాకరించింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, ఆ తీర్పునే సమర్థించింది. దీంతో ఆమెకు చట్టపరంగా ఉన్న ఒక ప్రధాన మార్గం మూసుకుపోయినట్లయింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు ట్రయల్ కోర్టులో విచారణకు లైన్ క్లియర్ అయ్యింది. ఓఎంసీకి లీజులు కేటాయించే క్రమంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న సీబీఐ ఆరోపణలపై ఇప్పుడు దిగువ కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసుల్లో ఇతర నిందితులకు శిక్షలు ఖరారు అయ్యాయి. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో, అధికార దుర్వినియోగానికి పాల్పడి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమంగా లీజులు కట్టబెట్టారని ఆమెపై అభియోగాలున్నాయి. ఈ కేసులో ఆమె గతంలో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో కొనసాగుతున్న ఆమెకు, ఈ తీర్పు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకాల్లో భారీ అక్రమాలకు పాల్పడిందని 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. నిర్ణీత సరిహద్దులను దాటి మైనింగ్ చేయడం, అటవీ ప్రాంతాలను ఆక్రమించడం మరియు ఇతర నిబంధనలను ఉల్లంఘించడంపై విచారణ మొదలైంది. అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు మోపింది. నిబంధనలకు విరుద్ధంగా లీజులను కేటాయించడం, లీజు మంజూరు ప్రక్రియలో కొన్ని కీలక పత్రాలను తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి, గాలి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా కుట్ర పన్నారని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది.
ఈ కేసులో భాగంగా శ్రీలక్ష్మి 2011లో అరెస్ట్ అయ్యారు. సుమారు పది నెలల పాటు ఆమె చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం ఆమెను సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె బెయిల్పై విడుదలయ్యారు. శ్రీలక్ష్మి తనపై ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టేయాలని కోరడానికి ప్రధాన కారణం సాంకేతిక కారణాలు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనపై విచారణ చేపట్టడం చెల్లదని ఆమె వాదించారు. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరగాల్సిందే అని స్పష్టం చేయడంతో, ఆమె ఇక తదుపరి కోర్టు విచారణలకు హాజరు కావాల్సి ఉంటుంది.








