- ధరణి దోపిడిపై ఉక్కుపాదం
- తీగలాగితే డొంక కదిలినట్లుగా ధరణి వ్యవహారం
- అక్రమాలపై కఠిన చర్యలు తప్పవు
- కోడ్ ఆడిట్కు ఆదేశాలు
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మహా :తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించవలసిన వ్యవస్ధనే ఆనాటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నత స్ధాయి కమిటీతో విచారణ జరిపించగా దిగ్బ్రాంతి కరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నామన్నారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని వ్యవస్ధాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్ఫష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్ రిమాట్లాడుతూ.. ఆనాడు ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చారని అలాగే మానవ ప్రమేయంతో తప్పులు చేసే విధంగా పోర్టల్ ను రూపొందించారని , భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభించకుండా లాగిన్లు డిలిట్ చేశారని, అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నత స్ధాయి కమిటీ విచారణలో ప్రాధమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల సమాచారం లభించకుండా చేశారని , ఫోరెన్సిక్ ఆడిట్లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందని, ఈ నేపధ్యంలో తక్షణమే ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణా బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్దకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావలసిన స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తప్పుచేసినవారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వానికి రావలసిన ప్రతిపైసాను వసూలు చేస్తామన్నారు. దీనిపై ఉన్నత స్ధాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఏ చిన్న లోపానికి తావులేకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్ ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ , సిఎం ఆర్ వో మందా మకరంద్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డిఐజి సుభాష్, ఎస్బి ఎస్పీ సింధు శర్మ, సైబర్క్రైమ్ డిఎస్పీ ఎ. సంపత్, హోంశాఖ సలహాదారు పి. శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.








