- TGSIIC భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు.!
- రైతులను మభ్యపెట్టి యదేచ్చగా వ్యాపారం
- కనీసం కన్నెత్తి చూడని అధికారులు పోలీసులు
- ఇప్పటికైనా అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలి
- 166లోని ప్రభుత్వ సంపదను అధికారులు కాపాడాలి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఎలిమినేడులోని ప్రభుత్వ భూములలో యదేచ్చగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఇబ్రహీంపట్నం మండలం, ఎలిమినేడు గ్రామ రెవెన్యూ పరిధి, ఆమ్లెట్ గ్రామం మేటిలలో సర్వేనెంబర్ 166లోని 133 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఈ యొక్క భూమిని గతంలో టీజీఎస్ఐఐసి ప్రభుత్వ సంస్థ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క భూమిలో గతంలో కబ్జాలో ఉన్న రైతులను మభ్యపెట్టి ఎలిమినేడు, జబ్బారిగూడ గ్రామాలకు చెందిన కొందరు అక్రమార్కులు, టీజీఎస్ఐఐసి సంస్థ, జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారుల కన్నుగప్పి, యదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరిపి, ప్రభుత్వ సంపదను సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కనీసం కన్నెత్తి చూడని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని, ఆ భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ సంపదను అధికారులు కాపాడాలి…..
శుక్ర శనివరాల రాత్రి వేళలో జోరుగా తవ్వకాలు జరుపుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. శుక్ర శనివారాలు వారంలో చివర రోజులు కావడం అధికారులు పెద్దగా పట్టించుకోరనే ఉద్దేశంతో, అక్రమార్కులు జోరుగా మట్టి తవ్వకాలు జరుపుతారు. ఇక ఆదివారం అయితే పగలు రాత్రి పూట అక్రమ మట్టి రవాణా జరుగుతుంది. రాత్రి వేళలో పోలీస్ వాహనాల పక్కన నుంచి వెళ్లిన పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ సంపదను కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.







