Mahaa Daily Exclusive

  డిజిటల్ మోసాలపై అప్రమత్తత అవసరం

Share

  • డిజిటల్ మోసాలపై అప్రమత్తత అవసరం
  • మన్ కీ బాత్ లో
  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక హెచ్చరిక

న్యూఢిల్లీ, మహా: దేశంలో డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కంటే డిజిటల్ మోసాలను కట్టడి చేయటం పోలీసులకు పెద్ద కష్టంగా మారింది. ప్రజలలో అవగాహన కల్పిస్తున్నా సరే ఎక్కడో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ మోసాలపైన ప్రజలను అప్రమత్తం చేశారు.

డిజిటల్ అరెస్ట్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి మరోసారి ప్రస్ధావించారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాలపై సమాజంలో ఇప్పటికే చాలా అవగాహన వచ్చిందన్నారు. అయితే ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతున్నాయన్నారు. ఇవి క్షమించరానివని, డిజిటల్ అరెస్టుకు, ఆర్థిక మోసానికి అమాయకులు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా, అవగాహనతో ఉండటం చాలా ముఖ్యమన్నారు. కేవైసీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ. బ్యాంకు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కేవైసీ- నో యువర్ కస్టమర్- పట్ల అప్రమత్తత అత్యంత ముఖ్యమైన అంశమని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ఈ ప్రక్రియ అందరికీ తెలిసినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాన్నారు. బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు ఎప్పటికప్పుడు తిరిగి- కేవైసీ నిర్వహిస్తాయన్నారు.

కేవైసీ పేరుతో సైబర్ మోసాలు .. జాగ్రత్త

ఇదే అవకాశంగా నేరస్థులు నకిలీ కాల్స్ చేస్తారని, ఎస్ ఎం ఎస్, లింకులను పంపుతారని, అలాంటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మీకు వచ్చే మెసేజ్ లను నమ్మొద్దని, అనుమానం ఉంటే నేరుగా బ్యాంకుకే వెళ్లి నిర్ధారించుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందేశాన్ని గమనించి,. కేవైసీని నవీకరించుకోవాలన్నారు. కేవలం బ్యాంక్ యాప్స్ లేదా బ్రాంచ్‌ల ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పాస్ వర్డ్స్ తరచూ మారుస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకే పాస్ వర్డ్ చాలా కాలం పాటు ఉంచకుండా పాస్‌వర్డ్‌లు తరచూ మారుస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలలో అప్రమత్తతే అన్నిటి కన్నా ముఖ్యమని, కనుక ప్రజలు డిజిటల్ మోసాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్రమత్తంగా లేకుంటే మీ కష్టార్జితం సైబర్ నేరగాళ్ళ పాలు అయ్యే ప్రమాదం ఉంటుందని ప్రధాని మోడీ హెచ్చరించారు.