- బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ
- నలుగురు ఉద్యోగులు తొలగింపు
- అర్చకుడికి చార్జ్ షీట్
- ఈవో, సూపరింటెండెంట్ సస్పెన్షన్కు ఆదేశం
హైదరాబాద్, మహా: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అటవీ,పర్యావరణ, మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై వేటు వేశారు..
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బందిని సేవల నుండి తొలగించాలని మంత్రి ఆదేశించారు. స్వీపర్ (ఔట్సోర్సింగ్) జి. రాము, అటెండర్ (రెగ్యులర్) ఎస్. శ్రీహరి, స్వీపర్ (ఔట్సోర్సింగ్) పి. నరసింహ, సీనియర్ అకౌంటెంట్ (ఔట్సోర్సింగ్) జి. ప్రభాకర్ రావును విధుల నుండి తొలగించాలని నిర్ణయించారు. అర్చకుడు ఎ. శ్రీనివాస చార్యులపై చార్జ్ షీట్ మెమో జారీ చేయాలని ఆదేశించారు.
అలాగే, పరిపాలనా మరియు పర్యవేక్షణ లోపాల కారణంగా దేవాలయ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. .ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి గారు ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.








