హైదరాబాద్, మహా: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమాన మార్గాలను మార్చడం లేదా రద్దు చేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధానంగా గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. శంషాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ప్రయాణికుల ఆందోళన..
ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సంస్థలు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ తేదీలను కేటాయిస్తున్నప్పటికీ, యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
కొన్ని విమాన మార్గాల్లో మార్పులు
ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రాలను మూసివేయడం లేదా ప్రమాదకరంగా ప్రకటించడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ కాలం 2 నుంచి 3 గంటలు పెరుగుతోంది. సుదీర్ఘ మార్గాల వల్ల ఇంధన ఖర్చు పెరిగి, విమాన టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలనుకునే వారు తమ విమాన సంస్థల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఎయిర్ పోర్టుకు బయలుదేరడం శ్రేయస్కరమని పలువురు చెబుతున్నారు..








