- పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం
- తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్
- ఆదేశించిన సీఎం రేవంత్, ఏర్పాటు చేసిన అధికారులు
న్యూఢిల్లీ, మహా : మధ్యప్రాచ్యంలో(పశ్చిమాసియా) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రాచ్యం(పశ్చిమాసియా) ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. తెలంగాణ భవన్లోని సీనియర్ అధికారులు.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల దృష్ట్యా.. తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు 24×7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏవైనా ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు. మధ్యప్రాచ్యం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు ఇవే…
వందన బరువా (పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్): +91 9871999044
సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్): +91 9958322143
జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్): 9910014749
రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): +91 9643723157..







